అల్లసాని పెద్దన(Allasani Peddana)


ఆంధ్ర కవితా పితామహునిగా పేరుగాంచిన అల్లసాని పెద్దన శ్రీ కృష్ణదేవరాయల ఆస్ధానం అష్టదిగ్గజములలో అగ్రగణ్యుడు. సంస్కృతాంధ్ర కవిత్వం ఎలా ఉండవలెను అని ఒక ఉత్పలమాల చెప్పి రాయల చేత సన్మానం, గండపెండేరం తొడిగించుకున్నవాడు. ఇతడు రచించిన మనుచరిత్ర ఆంధ్రవాఙ్మయములో ప్రధమ ప్రబంధముగా ప్రసిద్దికెక్కినది. ఇతను కవి మాత్రమే కాక రాచకార్యాలలో కూడా రాయలవారికి సలహాలు ఇచ్చువాడు, అందుకే ఇతనిని పెద్దనామాత్యుడు అని కూడా అంటారు.పెద్దన్న గారికి ఆంధ్రకవితాపితామహుడు బిరుదు శ్రీకృష్ణదేవరాయలవారిచ్చినది.

మను చరిత్ర ఇతివృత్తము:

మను చరిత్రము లేదా స్వారోచిష మనుసంభవము, అల్లసాని పెద్దన రచించిన ఒక ప్రబంధ కావ్యము. మారన ‘మార్కండేయ పురాణం’లో 150 పద్యాల్లో రాసిన మను చరిత్ర కథను పెద్దన ఆరువందల శ్లోకాలకు పెంచాడు. ఇది వరూధినీ, ప్రవరాఖ్యుల ప్రేమ కథతో మొదలై స్వారోచిషుని తో ముగుస్తుంది. కాశి నగరం దగ్గర ప్రవరుడనే పరమ నిష్టాగరిష్టుడైన బ్రాహ్మణుడు, అతనికి అనుకూలవతియైన భార్య ఉండేవారు. వారు అతిథులను ఎంతగానో ఆదరించేవారు. వారి ఇంటికి వచ్చిన ఒక సిద్ధుడు ప్రవరునికి ఒక మహిమాన్వితమైన పసరును ఇచ్చాడు. ఆ పసరు కాళ్ళకు పూసుకొని ఆ దివ్య ప్రభావం వలన ప్రవరుడు హిమాలయ పర్వతాలకు పోయి అక్కడి సుందర దృశ్యాలను చూచి ఆనందిస్తాడు. అయితే ఎండకు ఆ పసరు మంచులా కరిగిపోయింది.

తిరిగి పోయే ఉపాయం కోసం చూస్తున్న ప్రవరుడిని చూసి వరూధిని అనే అప్సరస మనసు పడింది. అయితే ప్రవరుడు ఆమెను తిరస్కరించి వెళ్ళిపోయాడు. కామవిరహంతో ఉన్న వరూధినిని ఒక గంధర్వుడు ప్రవరుని వేషంలో సమీపించి తన కోరిక తీర్చుకున్నాడు. వారికి జన్మించిన స్వరోచి ఒక దేశానికి రాజయ్యాడు. ఆ స్వరోచి ఒకసారి వేటకు వెళ్ళి మనోరమ అనే యువతిని పెళ్ళాడాడు. వారి కొడుకే స్వారోచిష మనువు.


ఇది తొలి తెలుగు ప్రబంధము గా పండితులు చెపుతారు, దీని తరువాత మొదలైనదే ప్రబంధ యుగము, తరువాతి ప్రబంధాలు దీని నుంది స్పూర్తిపొందినవే ఎక్కువగా ఉన్నాయి. చతుర్దశ వర్ణనలూ, ఆరు ఆశ్వాసాలతో కూడిన కథా కావ్యమిది. దీనిని తెలుగు లో పంచకావ్యాలలో ఒకటిగా చెపుతారు.

''వినాయక ప్రార్ధన''

అంకముజేరి శైలతనయాస్తన దుగ్ధములానువేళ

బాల్యాంకవిచేష్ట తొండమున అవ్వలిచన్‌ కబళింపబోయి
ఆవంక కుచంబు గాన కహివల్లభహారము గాంచి వే మృణా
ళాంకురశంక నంటెడు గజాస్యుని కొల్తు నభీష్టసిద్ధికిన్‌


''హిమాలయ వర్ణన''

అటజనికాంచె భూమిసురు డంబరచుంబి శిర స్సర జ్ఝరీ
పటల ముహుర్ముహు ర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్‌
కటకచరత్‌ కరేణు కర కంపిత సాలము శీతశైలమున్‌


''నర్మగర్భంగా వరూధిని పలుకులు''

ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర

ఏకాంతమునందునున్న జవరాండ్ర నెపంబిడి పల్కరించు
లాగింతియ కాక నీవెరుగవే మునువచ్చిన త్రోవచొప్పు
నీకింత భయంబులే కడుగ నెల్లిదమైతిమె మాటలేటికిన్‌

''ప్రవరుడు వరూధినిని తిరస్కరించుట''

ప్రాంచద్భూషణ బాహుమూలగతితో పాలిండ్లుపొంగార పై
యంచుల్‌ మోవగ కౌగిలించి యధరంబాసింప హా శ్రీహరీ
యంచున్‌ బ్రాహ్మణు డోరమోమిడి తదీయాంసద్వయం బంటి పొ
మ్మంచున్‌ ద్రోచె కలంచునే సతులమాయల్‌ ధీరచిత్తంబులన్‌

ఆంధ్ర కవితా పితామహుడిగా పేరుపొందిన అల్లసాని పెద్దన రచించిన మనుచరిత్రము లోని తృతీయాశ్వాసం లోనిది ఈ పద్యం. ఇందులో కవి సాయంకాలాన్ని వర్ణిస్తున్నారు:
శ్రేణుల్ గట్టి నభోంతరాళమునఁ బాఱెన్ బక్షు; లుష్ణాంశుపా
షాణ వ్రాతము కోష్ణమయ్యె; మృగతృష్ణావార్ధు లింకెన్; జపా
శోణం బయ్యెఁ బతంగ బింబము; దిశా స్తోమంబు శోభాదరి
ద్రాణం బయ్యె, సరోజషండములు నిద్రాణంబు లయ్యెం గడున్
(సాయంకాలం అయ్యేసరికి ఆకాశంలో బారులు బారులుగా ఇంటిముఖం పట్టిన పక్షులూ, పగటి వేడి తగ్గగానే చల్లబడిన సూర్యకాంత శిలలూ, ఎండతో పాటే మాయమైపోయిన ఎండమావులూ, కాషాయ వర్ణం నింపుకున్న సూర్య బింబమూ, కాంతిని కోల్పోయిన దిక్కులూ, కొలనులో ముడుచుకొని పోతున్న తామరలూ)
అష్టదిగ్గజ కవులు-వారు రచించిన ప్రబంధాలు

    1.అల్లసాని పెద్దన - మను చరిత్ర


    2.నంది తిమ్మన - పారిజాతాపహరణం

    3.తెనాలి రామకృష్ణుడు - పాండురంగ మహాత్మ్యం

    4.ధూర్జటి - శ్రీ కాళ హస్తీశ్వర మహాత్మ్యం

    5.పింగళి సూరన - కళా పూర్నోదయం

    6.రామ రాజ భూషణుడు - వసు చరిత్ర

    7.అయ్యలరాజు రామభధ్రుడు - రామాభ్యుదయం

    8.మాదయగారి మల్లన - రాజశేఖర చరిత్ర

భట్టుమూర్తి(రామ రాజ భూషణుడు) అసాధారణ ప్రతికల్గినవాడు. 'అచల జిహ్వము'(నాలుక కదపకుండా) పద్యాలను రచించ గలిగాడు.
ఉదా:
''భోగాంబువాహ వాహవిభాగేహాభావుకాంగ భావభవమహా
భాగమహీభాగమహా బోగావహబాహు భోగిపుంగవ భోగా'' 

వసు చరిత్రలో రామరాజ భూషణుని చంద్రోదయ వర్ణన:

హరిదంభోరుహలోచన ల్గగనరంగాభోగరంగ త్తమో
భర నేపథ్యము నొయ్య నొయ్య సడలింపన్, రాత్రి శైలూషికిన్
వరుసన్ మౌక్తికపట్టమున్, నిటలమున్, వక్తంబునుం దోఁచె నా
హరిణాంకాకృతి వొల్చె రే కయి, సగం బై, బింబ మై తూర్పునన్.

గగనరంగ మనే విశాల రంగస్థలం మీద రాత్రి అనే నట్టువకత్తె చూపించబోయే నాట్య ప్రదర్శనకు ముందుగా పద్మలోచనలు తాము పట్టుకున్న చీకటి అనే తెఱను మెల్లమెల్లగా సడలిస్తుండగా రాత్రి అనే నట్టువకత్తెకు వరుసగా ముందు మౌక్తిక పట్టము, తఱువాత నుదుటి భాగము ఆ తఱువాత నిండుముఖమూ కనిపించినట్లుగా మొదట ఒక వంకర రేక గాను తఱువాత సగ భాగముగాను తఱువాత పూర్ణబింబమూ గాను తూర్పున ఉదయిస్తూన్న ( లేడిని తనయందు గలిగి ఉన్న) చందమామ కనిపించినదట. ఎంత మనోహర వర్ణన !


పింగళి సూరన్న రాఘవపాండవీయము అనే ఒక అత్యధ్భుతమైన శ్లేష కావ్యాన్ని రచించాడు. ఈ కావ్యంలో ఉన్న ప్రతి ఒక పద్యాన్ని రామాయణంలోని కథకూ, భారత ఇతిహాసములోని కథకూ ఒకేసారి అన్వయించుకోవచ్చు”కతరాజు” గా పేరుపడ్డ పింగళి సూరన సంప్రదాయ తెలుగు సాహితీకారుల్లో ఎంతో విశిష్టుడు. అతను రాసిన “కళాపూర్ణోదయం”, “ప్రభావతీ ప్రద్యుమ్నం” తెలుగు సాహిత్యంలో అపూర్వ కథా రచనలు. కథాకల్పనలో ఇతనికున్న ప్రతిభ ఇంకెవర్లోనూ కనిపించదు. పురాణపాత్రల్ని వాడుకుంటూనే పూర్తిగా స్వయంకల్పిత కథల్ని అల్లటంలోనూ ఉత్కంఠత పెంచుకుంటూ చెప్పటం లోనూ ఇతనికితనే సాటి.


Popular Posts